- ఉగాది వేడుకల్లో కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)
ఎన్నికల సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం కలెక్టరేట్ లో స్పందన మీటింగ్ హాలులో జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది.జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఈ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలలో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె. చంద్రశేఖర రావు, ఆర్డీవో ఎం వాణి లతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.పేరులోనే క్రోధం ఉంది, క్రోధాన్ని అధిగమించి మా విధుల్లో ఎలా ముందుకు వెళతామో, అలాగే ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం, అనేక సవాళ్లు ఎదురవుతాయని, వాటిని అధిగమించే శక్తి నివ్వాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.అనంతరం వేద పండితులు అతిథులకు ఆశీర్వచనం పలికారు. ఈ వేడుకల సందర్భంగా దేవాదాయ శాఖ తరపున వేద పండితులు, అర్చక స్వాములను జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు.దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ నటరాజ షణ్ముగం, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సమన్వయ అధికారి దుర్గా కిషోర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.తొలుత వేద పండితులు వేద ప్రవచనం చేశారు.అనంతరం వేద పండిత. ముత్తేవి శ్రీనివాస శశికాంత్ పంచాంగ శ్రవణం చదివి వినిపించారు.షడ్రుచులు మేళవించి సంప్రదాయబద్ధంగా తయారు చేసిన ఉగాది పచ్చడి అతిథిలతో సహా ఆహుతులందరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిసిఈఓ ఆనంద్ కుమార్, సమాచార శాఖ డి డి వెంకటేశ్వర ప్రసాద్, విద్యుత్ శాఖ ఈఈ భాస్కరరావు సర్వే ఏడి మనిషా త్రిపాఠి వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి కామరాజు, చీఫ్ కోచ్ ఝాన్సీ, ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ పి వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.