- ఇండియా వేదిక నాయకులు
ప్రజాశక్తి-కంకిపాడు
ఎపి ప్రజలను దగా చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రానున్న ఎన్నికల్లో సాగనంపాలని ఇండియా వేదిక నాయకులు పిలుపునిచ్చారు. పెనమలూరు నియోజకవర్గ ఇండియా వేదిక బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల సుబ్రహ్మణ్యం విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం కాంగ్రెస్ నాయకులు కిలారు వెంకటరత్నం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనేకుల మురళీమోహన్రావు మాట్లాడుతూ ఎన్డఎ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పంచకర్ల రంగారావు మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి సంపన్నులకు దారాదత్తం చేసిన మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. మున్నంగి నరసింహారావు మాట్లాడుతూ కుల మతాల మధ్య చిచ్చు పెట్టి అభివృద్ధిని అటకెక్కించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపాలన్నారు. మస్తాన్ వలి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం మద్యపాన నిషేధం చేస్తానని వాగ్దానం చేసి నాసిరకం బ్రాండ్లను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం అడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు త్రిమూర్తులు, కాంగ్రెస్ పార్టీ పెనమలూరు మండల అధ్యక్షులు అరికట్ల సురేష్, రాజశేఖర్ వర్మ, బాలాజీ నాయక్, కొసనం రాము, కైలే సునీల్, రాజేష్, కీర్తి, సిహెచ్.భవాని, పుసులూరి పాతాళ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.