పార్వతీపురంరూరల్ : మండలంలో 2022-23గానూ 16వ విడత ఉపాధి హామీ చట్టంతో పాటు పలు సంక్షేమ పథకాల సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం సాదాసీదాగా జరిగింది. మంగళవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ప్రాంగణంలో డ్వామా పిడి రామచంద్రరావు అధ్యక్షతన ఎంపిపి మజ్జి శోభారాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పంచాయతీలకు చెందిన క్షేత్ర సహాయకులు నిర్వహించిన పనులపై జిల్లా రిసోర్స్ పర్సన్ జరిపిన ఆడిట్ పంచాయతీల వారీగా చదివి వినిపించారు. సాంకేతిక తప్పిదాలపై ఆయా ఫీల్డ్ అసిస్టెంట్లను నిలదీశారు, ఎల్ఎన్ పురం, కృష్ణపల్లి, గోచెక్క, నర్సిపురంతో పాటు పలు గ్రామాలకు చెందిన క్షేత్రసహాయకులకు రికవరీలను విధిస్తూ సదరు రికవరీని వారితో పాటుగా గతంలో పనిచేసిన ఎపిఒ అలజంగి భానును కూడా బాధ్యులు చేయాలని డ్వామా పీడీ సూచించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ అకిబ్ జావేద్, ఇఒపిఆర్డి కృష్ణుడు, ఎపిఒ నాగలక్ష్మి, జెడ్పిటిసి రేవతమ్మ, ఎఎంసి చైర్మన్ ఎం.భాగ్యలక్ష్మి, వైస్ ఎంపిపిలు జగన్నాధరావు, బంకురు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.