విజేతలకు బహుమతులను అందజేస్తున్న డైరెక్టర్ పి.ఆశ తదితరులు
మహిళలు ఉన్నత స్థాయికి ఎదగాలి
– శ్రీ పద్మావతి హైస్కూల్ అకాడమిక్ డైరెక్టర్ పి.ఆశ
ప్రజాశక్తి – ఆత్మకూరు
ప్రస్తుత సమాజంలో మహిళలు ఉన్నత స్థాయికి ఎదగాలని శ్రీ పద్మావతి హైస్కూల్ అకాడమిక్ డైరెక్టర్ పి.ఆశ ఆకాంక్షించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఆత్మకూరు పట్టణంలోని ఏకలవ్య నగర్లో మహిళలకు శ్రీ పద్మావతి హైస్కూల్, సిఐటియు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, కుర్చీల ఆట పోటీలతో పాటు పలు కార్యక్రమాలు సోమవారం నిర్వహించారు. ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు శ్రీ పద్మావతి హైస్కూల్ అకాడమిక్ డైరెక్టర్ పి.ఆశ బహమతులను ప్రదానం చేశారు. అనంతరం డైరెక్టర్ పి.ఆశ మాట్లాడుతూ నిత్యం పనులతో బిజీగా ఉండే మహిళలకు పండగ సందర్భంగా ఇలాంటి ఆటల పోటీలను నిర్వహించడం వల్ల కొంత మేర ఉపశమనం, ప్రశాంతత కలుగుతుందని అన్నారు. ప్రతి మహిళ, ఆడ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు తాము స్నేహ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఆటల పోటీలను నిర్వహించిన సిఐటియు నాయకులు రణధీర్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు యేసురత్నం, రణధీర్, రాము నాయక్, సంస్థ చీఫ్ అడ్వైజర్ పి.నూర్ బాషా, మహిళలు పాల్గొన్నారు.