అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు
లయన్స్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జయంతి
ప్రజాశక్తి – నంద్యాల
అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జయంతిని శనివారం నంద్యాలలోని వికలాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో లయన్స్ క్లబ్, వికలాంగుల సంక్షేమ సంఘం సంయుక్త నిర్వహణలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గోళ్ల రాజేంద్రప్రసాద్ (రాజేష్) సౌజన్యంతో రూ. 20 వేల విలువ చేసే చంక కర్రలు 20 మంది వికలాంగులకు, ఐదుగురు వికలాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు పీవీ సుధాకర్ రెడ్డిలు మాట్లాడుతూ మెల్విన్ జోన్స్ స్థాపించిన అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థ ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాలలో వేలాది క్లబ్బుల ద్వారా లక్షలాది సభ్యుల చేత కోట్లాదిమందికి సేవా కార్యక్రమాలు గత 100 సంవత్సరాలకు పైగా జరుగుతున్నాయని చెప్పారు. నంద్యాల లయన్స్ క్లబ్ కూడా 50 సంవత్సరాలకు పైగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందని, భవిష్యత్తులో కూడా వికలాంగుల సంక్షేమ సంఘంతో కలిసి వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సోమేశుల నాగరాజు, కోశాధికారి మామిళ్ల నాగరాజు, జోన్ చైర్మన్ చంద్రమోహన్, జిల్లా చైర్మన్ ఎంపివి.రమణయ్య, ఎలుకూరి మురళీమోహన్, యూసుఫ్, వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.