ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ప్రారంభమైంది. స్థానిక ఏసీ కాలేజిలో పిఒలు, ఎపిఓలకు శిక్షణ అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు. ఓటర్ల కోసం మొత్తం 6 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అందులో 4 గుంటూరు తూర్పు నియోజకవర్గానికి, 2 ఇతర నియోజక వర్గాల ఓటర్ల కోసం కేటాయించారు. స్థానిక నియోజకవర్గంలో విధులు కేటాయించిన ఆయా ఉద్యోగులు ఏ నియోజకర్గానికి చెందిన వారైనా సరే ఇక్కడే ఓటు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులకు ఈసీ నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం ఈనెల 5 నుండి 8 వరకు పోస్టల్ బ్యాలెట్లు స్వీకరిస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్ ఎస్.పి.కార్తీక, కీర్తి చేకూరి కలిసి సందర్శించారు. 5, 6 తేదీల్లో పిఓ, ఏపిఓలు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ అనంతరం పోస్టల్ బ్యాలెట్ చేయడానికి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. 7వ తేదీ ఓపిఓలు, 8వ తేదీ పోలీసులు, ఎన్నికల విధులు కేటాయించబడిన ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్కి ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే ఎన్నికల విధుల్లో ఉండి ఫారం-12 దరఖాస్తు చేసుకోని ఉద్యోగులు ఈనెల 7,8 తేదీల్లో రిటర్నింగ్ అధికారి కార్యాల యాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/gnt-7.jpg)