ఒంగోలు కలెక్టరేట్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్ : సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పని చేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జేఏసీ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిరవధిక సమ్మె బుధవారం ప్రారంభమైంది.సమ్మె కార్యక్రమానికి సమగ్ర శిక్ష జేఏసీ ప్రధాన కార్యదర్శి యు కళ్యాణి అధ్యక్షత వహించారు .సమ్మెకు సిఐటియు ,యుటిఎఫ్, ఏపీటీఎఫ్ ,ఎస్ టి యు ,జనవిజ్ఞాన వేదిక నాయకులు మద్దతు తెలియజేశారు.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మినిమం టైం స్కేల్, హెచ్ఆర్ఏ, డిఏ అమలుచేసి వేతనాలు పెంచాలన్నారు.అవుట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలోనికి మార్చి మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలన్నారు.పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలన్నారు.మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని ,కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. వేతనాల కోసం సంవత్సరానికి సరిపడే బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.కార్యక్రమంలో సమగ్ర శిక్ష జేఏసీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఎం హరిబాబు సభ్యులు ఎన్ మధు, ఎన్ చంద్రశేఖర్, కే శ్యాంబాబు , సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.