ప్రజాశక్తి – సాలూరు : వైసిపి నాయకులు, కార్యకర్తలు అభిమానుల జోలికి ఎవరైనా వస్తే తాట తీస్తానని డిప్యూటీ సిఎం రాజన్నదొర హెచ్చరించారు. పట్టణంలోని11,12 వార్డుల్లో చినహరిజనపేట, గాడివీధి, కర్రి వీధుల్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం అక్కేన వీధి రామమందిరం వద్ద ఆయన మాట్లాడుతూ వైసిపి కార్యకర్తలను కొంతమంది టిడిపి నాయకులు బెదిరిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. తమ కార్యకర్తలు, అభిమానుల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంతవరకు నాలుగు సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని, ఎప్పుడూ గొడవలు జరగలేదన్నారు. ప్రత్యర్ధులు గొడవలు కోరుకుంటే తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కోరుకుంటానని చెప్పారు. కొండలు, కోనల్లో పుట్టి పెరిగిన వాడిగా తనకు భయం లేదన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం రూపంలో లబ్ది చేకూర్చిన ప్రభుత్వం తమదేనని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, పట్టణ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, జెసిఎస్ కన్వీనర్ గిరిరఘు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గొర్లి జగన్మోహన్ రావు, సీనియర్ నాయకులు గొర్లి మధుసూదనరావు, కౌన్సిలర్లు లింగాల దుర్గా, ముషిడిపిల్లి సరోజిని, డిసిఎంఎస్ డైరెక్టర్ పిరిడి రామకృష్ణ, వైసిపి నాయకులు లింగాల సింహాచలం, ఎం.కృష్ణా రావు, కొల్లి వెంకటరమణ, పిఎసిఎస్ అధ్యక్షులు యర్రా దాలినాయుడు పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని మరిపివలస, చిన్నరాయుడుపేట, తాన సీతారాంపురం, గుచ్చిమి, జోగింపేటలో వైసిపి అభ్యర్థి అలజంగి జోగారావు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టిడ్కో చైర్మన్ జమ్మన ప్రసన్నకుమార్, ఎంపిపి బి.రవణమ్మ, శ్రీరాములునాయుడు, జెడ్పిటిసి సభ్యులు ఎం.బాబ్జీ, మండల వైసిపి అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.బాగువలసలో…మండలంలోని పెదపధం పంచాయతీ బాగువలసలో గురువారం సాయంత్రం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ రెడ్డి పద్మావతి, సర్పంచ్ రెడ్డి సుకన్య ఇంటింటి కీ తిరిగి ప్రచారం నిర్వహించారు. వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజన్నదొర, ఎంపి అభ్యర్థి తనూజారాణికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. పేదలకు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రాష్ట్రంలో మళ్లీ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పారు. రాజన్నదొర మరోసారి గెలిస్తే నియోజకవర్గం అభివద్ధి పథంలో నడుస్తుందని పద్మావతి చెప్పారు.
పాచిపెంట : వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి డోల బాబ్జీ, టి.గౌరీశ్వరరావు ఆధ్వర్యంలో పాచిపెంటలో ముమ్మురంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వైసిపి అభ్యర్థి పి.రాజన్న దొరను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి మీసాల నారాయణ, మీసాల చంటి. పాచిపెంట శ్రీనివాసరావు. ఎర్రయ్య. పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.