ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రం వద్ద మాట్లాడుతున్న కలెక్టర్ అరుణ్బాబు
ధర్మవరం టౌన్ : వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎన్నికల నియమ నిబంధనలు ప్రకారం సజావుగా నిర్వహించేందుకు అధికారులందరూ కృషి చేయాలని కలెక్టర్ అరుణ్ బాబు సూచించారు. బుధవారం మధ్యాహ్నం పట్టణంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేశారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారుల సమక్షంలో గోడౌను తెరిపించారు. ఈవీఎం, బ్యాలెట్ పేపర్, కంట్రోల్ యూనిట్, ఈవి ప్యాట్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద భద్రత పటిష్టంగా ఉండేలా అధికారులు అనునిత్యం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఓటు నమోదుకు ఏప్రిల్ 15వ తేదీ వరకు సమయం ఉందన్నారు. అందరికీ ఓటు హక్కును కల్పించే విధంగా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. నియోజకవర్గంలో పోలింగ్ బూత్ కేంద్రాలు ఓటర్లకు అనుకూలంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను వారు ఆదేశించారు. వద్ధులు, వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్, తహశీల్దార్ రమేష్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.