క్రికెట్ పోటీలను ప్రారంభిస్తున్న ఎస్పీ
పుట్టపర్తి రూరల్ : విద్యార్థులు విద్యతో పాటు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని క్రీడల వల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. సోమవారం బీడుపల్లి సంస్కృతి గ్రూప్ ఆఫ్ ఇన్యుస్టూషన్స్ నిర్వాహకులు నిర్వహిస్తున్న క్రీడా సాంస్కతిక యువజన ఉత్సవ కార్యక్రమానికి ఎస్పీ మాధవ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత నిత్యజీవితంలో చదువుతో పాటు, క్రీడలకు కూడా ప్రాధాన్యతనివ్వాలని క్రీడలతో మానసిక ప్రశాంతతో పాటు చక్కటి ఆరోగ్యం చేకూరుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తు, క్రీడా స్ఫూర్తిని నింపుతున్నారన్నారు. క్రీడలలో గెలుపోటములు సాధారణమని రెండింటిని సమానం తీసుకోవాలని సూచించారు. అనంతరం క్రీడాకారులతో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రీడాకారులతో ఎస్పీ కొద్దిసేపు క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఇందులో రాయలసీమ జిల్లాలైన కర్నూల్, తిరుపతి, కడప, చిత్తూరు, అనంతపురం నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి గ్రూప్ ఆఫ్ ఇన్యుస్టూషన్ డైరెక్టర్ అశోక్ కుమార్, దీన్ బాల కోటేశ్వరి, పుట్టపర్తి సిఐ కొండారెడ్డి, సంస్కృతి కాలేజీ ఆధ్యాపకులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.