ర్యాంకులు సాధించిన విద్యార్థులతో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు
హిందూపురం : పట్టణంలోని సువర్ణ భారతీ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించిన జెఈఈ పరీక్షల్లో ప్రతిభ కనబర్చారు. వారిలో గగన్ శ్వామ్ రెడ్డి 99.58 శాతం మార్కులను సాధించి ఉత్తమ ప్రతిభ కనబర్చారు. గగన్ శ్వామ్ రెడ్డి జాతీయలో ప్రథమ స్థానంలో నిలవడంతో అతని తల్లిదండ్రులైన నీలకంఠరెడ్డి, విజయ ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన కుమారుడికి మిఠాయిలు తినిపించారు. అదే విధంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. మంగళవారం కళాశాల ప్రిన్సిపల్ నీలకంఠ రెడ్డి, ఎఒ అనీల్ కుమార్ అధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేసి అభినందించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన గగన్ శ్వామ్ రెడ్డి మాట్లాడుతు తనకు రసాయన శాస్త్రం అంటే చాలా ఇష్టం అని, రాబోవు రోజుల్లో మంచి శాస్త్ర వేత్తగా ఎదిగి దేశానికి సేవలను అందించాలన్నదే తన సంకల్పమని అన్నారు. ప్రిన్సిపల్ నీలకంఠరెడ్డి మాట్లాడుతు సాధారణ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి జాతీయ స్థాయిలో రాణించే విధంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మంచి శిక్షణ ఇవ్వడంతో జాతీయ స్థాయిలో గగన్ శ్వామ్ రెడ్డి 99.58, ఇంద్రవంశి 94.86, సారిక 88.58, జలశ్రీ 83.08, రక్షిత 82.95, మనోజ్ 86.07, మానస 81.77, అశ్విని 81 శాతం మార్కులు సాధించారన్నారు. ఇందులో గగన్ శ్వామ్రెడ్డి తన కుమారుడు కావడంతో చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబర్చాలని సూచించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రవీంద్ర రెడ్డి, వేణు, శేషాద్రి మూర్తి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.