ఆరోగ్య ఉప కేంద్రంలో రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం
సోమందేపల్లి : మండల పరిధిలోని జూలుకుంట, చల్లాపల్లి ఆరోగ్య ఉప కేంద్రాలను శనివారం జిల్లా టాస్క్ ఫోర్స్ టీం సందర్శించి రికార్డులు, ఉద్యోగుల పనితీరును పరిశీలించారు. ప్రస్తుతం బిసిజి టీకా పొందిన గర్భిణలు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులను పిలిపించి రక్తహీనత పరీక్ష నిర్వహించారా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. ఆయా ఆరోగ్య ఉప కేంద్రాలు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోగ్య ఉప కేంద్రాల సిబ్బంది సమయపాలన పాటిస్తూ, చిన్నచిన్న లోపాలను సరిదిద్దుకొని ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి హరికుమార్, డిపిఒ నాగరాజు, డిపిహెచ్ఎన్ ఈరమ్మ, మేనేజర్ సుబ్బారావు, పర్యవేక్షకులు రవీంద్ర రత్నమ్మ, సిహెచ్ఒ మనోహర్రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.