సమావేశంలో మాట్లాడుతున్న శ్యామలరావు
- ఓటర్ల జాబితా జిల్లా ప్రత్యేక పరిశీలకులు జె.శ్యామలరావు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ఓటర్ల తుది జాబితాను ఈనెల 22న విడుదల చేయనున్నట్లు ఓటర్ల జాబితా జిల్లా ప్రత్యేక పరిశీలకులు జె.శ్యామలరావు వెల్లడించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇఆర్ఒలు, ఎఇఆర్ఒలతో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఓటర్ల తుది జాబితాను అందరు ఓటర్లు పరిశీలించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లకు ఎపిక్ కార్డులు శతశాతం అందాలన్నారు. ఆ దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పలు రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులకు తీసుకున్న చర్యలను తెలియజేయాలన్నారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. తొలగింపులు, చేర్పులకు సంబంధించి ఎవరైనా బల్క్గా దరఖాస్తులు ఎవరైనా ఇచ్చినా అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇన్ఛార్జి కలెక్టర్ ఎం. నవీన్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటివరకు మరుగుదొడ్లు, విద్యుత్, ర్యాంప్స్, తాగునీరు, తదితర సౌకర్యాలు లేకపోతే తక్షణమే ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రీ సర్వే త్వరితగతిన చేపట్టాలన్నారు. మండలాల్లో సమస్యలుంటే సంబంధిత ఆర్డిఒల ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. సమావేశంలో టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఆర్డిఒలు ఎస్.భరత్ నాయక్, సిహెచ్.రంగయ్య, ఉప కలెక్టర్లు బి.పద్మావతి, జి.జయదేవి, తహశీల్దార్లు, ఉప తహశీల్దార్లు పాల్గొన్నారు.