వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
జిల్లాలో 2,143 మందికి రూ.3.12 కోట్ల లబ్ధి
కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
అర్హత ఉన్న ఏ లబ్ధిదారుడూ సంక్షేమ పథకాలకు దూరం కాకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. జిల్లాలో అర్హత ఉండి సాంకేతిక కారణాల వల్ల పథకాలను పొందలేని 2,143 మంది లబ్ధిదారులకు రూ.3.12 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నవరత్నాలు – ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వారి ఖాతాల్లో నగదును సిఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి శుక్రవారం జమ చేశారు. కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది జనవరి నుంచి డిసెంబరు వరకు సాయం అందుకోని వారిని గుర్తించి నగదు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఇబిసి నేస్తం, అమ్మఒడి, కాపు నేస్తం, మత్స్యకార భరోసా, వాహనమిత్ర తదితర పథకాలతో వారికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కొత్తగా మరో తొమ్మిది వేల మందికి వివిధ పెన్షన్లు మంజూరు చేసినట్టు తెలిపారు. అనంతరం నమూనా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జెడ్పి చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి, సుడా చైర్పర్సన్ కోరాడ ఆశాలత, పలు కార్పొరేషన్ల చైర్పర్సన్లు రాజాపు హైమావతి, డి.పి దేవ్, డిఆర్డిఎ పీడీ విద్యాసాగర్, బిసి కార్పొరేషన్ ఇడి గడ్డెమ్మ, సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.