మాట్లాడుతున్న సింహాచలం
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
భూసేకరణ చట్టంలో పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు నష్ట పరిహారం ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ వెంటనే రద్దు చేసి, నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం సంఘం జిల్లా కార్యాలయంలో కమిటీ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహచలం మాట్లాడుతూ అభివృద్ధి అనే ముద్దు పేరుతో వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమలు, నేషనల్ హైవేలు, విమానాశ్రయాల పేరుతో పేదలు, దళితులకు చెందిన అసైన్డ్ భూములను లాక్కుంటున్నారని, దీనివల్ల పేదలకు గత ప్రభుత్వాలు ప్రయోజనం కల్పించి పట్టాలిచ్చిన భూములను సైతం భూసేకరణ పేరుతో తీసుకుంటున్నారని విమర్శించారు. 2013 భూసేకరణ పునరావాస చట్టాన్ని నీరుగార్చి దళితుల భూములకు చట్టబద్ధంగా నష్టపరిహారం ఇవ్వకుండా కార్పొరేట్లకు కట్టపెట్టేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పేదల చేతుల్లో ఉన్న భూములను కొల్లగొట్టి 2013 భూ సేకరణ చట్టాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దళితులకు గిరిజనులకు పేదలకు అన్యాయం చేసే విధంగా ఈ ఆర్డినెన్స్ ను తెచ్చిందని దీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జి.ఈశ్వరమ్మ, కొల్లి ఎల్లయ్య, సురవరపు సింహచలం, పల్ల మహేష్, మంగమ్మ, శ్రీను, భవాని, రాజేశ్వరి పాల్గొన్నారు.