వినతిపత్రం అందజేస్తున్న ఆశా కార్యకర్తలు
మంత్రి అప్పలరాజుకు వినతి
ప్రజాశక్తి – పలాస
ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి, ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.ధనలక్ష్మి డిమాండ్ చేశారు. స్థానిక ప్రగతి భవన్లో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజును ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ని ఆశాలుగా మార్పు చేయాలని కోరారు. ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్, వేతనంతో కూడిన మెటర్నటీ లీవ్ అమలు చేయాలన్నారు. పనిభారం తగ్గించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రూపు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, యాప్లు, సచివాలయ డ్యూటీలు రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. రూ.పది లక్షల గ్రూపు ఇన్సూరెన్స్ సౌకర్యం, రూ.ఐదు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. కోవిడ్ కాలంలో మరణించిన ఆశాలకు రూ.పది లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, నియామకాలను ప్రభుత్వమే చేపట్టి రాజకీయ జోక్యాన్ని నివారించాలన్నారు. ఆశాలకు ఎఎన్ఎం ట్రైనింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎఎన్ఎం, జిఎన్ఎం ట్రైనింగ్ పొందిన ఆశావర్కర్లకు ఎఎన్ఎం, హెల్త్ సెక్రటరీలు, స్టాఫ్ నర్సు నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రికి విన్నవించారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఆశావర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి ఎం.లావణ్య, నాయకులు వై.హేమలత, ఐ.యజ్ఞశ్రీ, సబితా పాత్రో, వి.రజని, ఎల్.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.