పింఛన్లను పంపిణీ చేస్తున్న మంత్రి అప్పలరాజు
- రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు
ప్రజాశక్తి – వజ్రపుకొత్తూరు
వైసిపి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మండలంలోని నువ్వలరేవులో వైఎస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా, ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ను రూ.మూడు వేలు ఇస్తున్నట్లు తెలిపారు. సచివాలయ వ్యవస్థతో జిల్లా, మండల కార్యాలయాలకు వెళ్లనవసరం లేకుండా ఉన్న ఊరిలోనే పనులవుతున్నాయని చెప్పారు. సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని కోరారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరినీ దగా చేశారని చెప్పారు. ఎన్నికలు వస్తుండడంతో మాయ మాటలతో మళ్లీ వస్తున్న చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అనంతరం నూతన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్పర్సన్ ప్రతినిధి పాలిన శ్రీనివాస్, ఎంపిపి ప్రతినిధి ఉప్పరపల్లి ఉదరు కుమార్, పిఎసిఎస్ అధ్యక్షులు దువ్వాడ మధుకేశ్వరరావు, జెసిఎస్ కన్వీనర్ కర్ణాకర్, సర్పంచ్ ఎజ్రా తదితరులు పాల్గొన్నారు.