సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్
* జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం కలెక్టరేట్లో 1950 టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఈ నంబరును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో 34వ వారపు సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో నిర్వహించే సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 1950, 18004256625 టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి ఫిర్యాదులనైనా ఈ టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి గానీ aజూఎఱజూరసశ్రీఎఏస్త్రఎaఱశ్రీ.షశీఎకి మెయిల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారి ఆధ్వర్యాన ప్రతిరోజూ ఉదయం పది నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు. కంట్రోల్రూమ్కు వచ్చిన ఫిర్యాదులను సిబ్బంది ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేసుకుంటారని తెలిపారు. జిల్లా ప్రజలు, ఓటర్లు, రాజకీయ పార్టీలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. నెల రోజులుగా 2,66,194 నూతన ఓటరు కార్డులు ముద్రణ కోసం పంపామని, వీటిలో 1,08,836 కార్డులు ముద్రణ పూర్తి కాగా, పోస్టల్ ద్వారా ఓటర్ల ఇళ్లకే చేరవేశామని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ తెలిపారు. సమావేశంలో ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.అప్పారావు, వైసిపి నాయకులు రౌతు శంకరరావు, టిడిపి నాయకులు పి.ఎం.జె బాబు, కాంగ్రెస్ నాయకులు డి.మల్లిబాబు, బిజెపి నాయకులు సురేష్బాబు సింగ్ తదితరులు పాల్గొన్నారు.