ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో రామారావు
ప్రజాశక్తి – పొందూరు
రాష్ట్ర కళింగ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా మండలంలోని తోలాపికి చెందిన దుంపల రామారావు (లక్ష్మణరావు)ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు చైర్మన్గా వ్యవహరించిన పేరాడ తిలక్ను వైసిపి శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడంతో ఇటీవల ఆయన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవి రామారావును వరించింది. రామారావు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసి కొన్నేళ్ల కిందట స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. ఆ తర్వాత జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలో ప్రారంభమైన ఆలిండియా బిసి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ పదవిని కట్టబెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అందుకు సహకరించిన శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, జెడ్పి చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, వైసిపి ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్కు ధన్యవాదాలు తెలిపారు. కళింగుల అభ్యున్నతికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. కళింగ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన రామారావుకు ఐహెచ్ఆర్ఎఐ రాష్ట్ర అధ్యక్షులు పప్పల రామ్మోహనరావు, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బొడ్డేపల్లి దామోదరరావు, తోలాపి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.