మాట్లాడుతున్న పరమేశ్వరరావు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, పార్టీ పున: నిర్మాణంలో భాగంగా విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు, జిల్లా పరిశీలకులు మీసాల సుబ్బన్న, డోల శ్రీనివాసరావు, గుత్తుల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నగరంలో ఇందిరా విజ్ఞాన్ భవన్లో సోమవారం జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గాల కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు, నాయకులు సమన్వయంతో పని చేయాలన్నారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల రెడ్డి ఆదేశాలతో పార్టీ విధానాన్ని ప్రజల మధ్యకు తీసుకు వెళ్లాలని, కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమాయత్తం చేయాలని కోరారు. ఎన్నికల్లో ఎవరికి పార్టీ అధిష్టానం టిక్కెట్ ఇచ్చినా సమిష్టిగా పనిచేసి ప్రజలకు దగ్గరవ్వాలన్నారు. సమావేశంలో పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పైడి నాగభూషణరావు, అంబటి కృష్ణ, గోవింద, మల్లిబాబు, రెళ్ళ సురేష్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కోత మధుసూదనరావు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.లక్ష్మి పాల్గొన్నారు.