బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమవుతున్న కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్
- క్రికెట్ ప్రాక్టీస్లో పాల్గొన్న కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబరానికి జిల్లాలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో క్రికెట్ నెట్ ప్రాక్టీస్లో స్థానిక యువతతో కలిసి శనివారం ఉదయం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా ప్రతి సచివాలయం పరిధిలో వాలంటీర్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని తెలిపారు. జిల్లాలోని అన్ని సచివాలయాల పరిధిలో ఈ నెల 15 నుంచి క్రీడల నిర్వహణ మొదలు కానున్నట్టు పేర్కొన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. 15 ఏళ్లు పైబడిన ఆసక్తి కలిగిన వారు వెబ్సైట్, యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. సచివాలయ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రీడల నిర్వహణ ఉంటుందని తెలిపారు. ఇందులో పురుషులకు, మహిళలకు విడివిడిగా క్రీడలు నిర్వహిస్తారని అన్నారు. 15 నుంచి ఫిబ్రవరి 3 వరకు క్రికెట్, కబడ్డీ ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ 5 అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తారని అన్నారు. ఐదు క్రీడ అంశాలే కాకుండా స్థానికంగా సంప్రదాయ క్రీడలనూ నిర్వహించనున్నట్లు తెలిపారు. సచివాలయం స్థాయిలో క్రీడలన్నీ 12 రోజుల పాటు కొనసాగుతాయని చెప్పారు. ఈ క్రీడల్లో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొందుకు అర్హులు కాదన్నారు. నియోజకవర్గంలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో నాలుగు అంశాల పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.35 వేలు, రెండో బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు నగదు బహుమతి ఇస్తారని చెప్పారు. జిల్లాస్థాయి విజేతలకు మొదటి బహుమతి రూ.60 వేలు, రెండో బహుమతి రూ.30 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు, రాష్ట్రస్థాయి విజేతలకు మొదటి బహుమతి రూ.5 లక్షలు, రెండో బహుమతి రూ.3 లక్షలు, మూడో బహుమతి రూ.2 లక్షలు ఇవ్వనున్నారని తెలిపారు. క్రీడలు ఆడేందుకు అవసరమైన అన్ని క్రీడా సామగ్రిని అందజేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సెట్శ్రీ సిఇఒ ప్రసాదరావు, కోచ్ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.