ఆందోళన చేస్తున్న దళితులు
కోటబొమ్మాళి: తప్పుడు సర్వే హద్ధుల నివేదికలు ఇచ్చి దళితులపై దాడులకు కారకులైన మండల సర్వేయర్, చిట్టివలస గ్రామ సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుని సమగ్రమైన సర్వే చేసి కొండ ఫోరంబోకు స్థలాన్ని కాపాడాలని దళిత హక్కుల పోరాట సమితి, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహశీల్దార్ కార్యాలయం ముందు డిహెచ్పిఎస్ ఆధ్వర్యాన తులసిపేట దళితులు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు అనపాన షణ్ముఖరావు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు పాల పోలారావు మాట్లాడుతూ చిట్టివలస రెవెన్యూ గ్రామంలో సర్వే నంబరు 198లో వండాన రాజేశ్వరమ్మ 0.42 1/2 సెంట్లు భూమి కొనుగోలు చేసి సాగు చేస్తున్నారని, అటువంటిది 0.89 సెంట్లు భూమికి ఎలా సర్వే హద్దులు నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ఎదురుగా ఉన్న కొండ ఫోరంబోకు సర్వే నెం.196లో 0.37 1/2 సెంట్లు భూమి ఆక్రమణదారులకు ధారాదత్తం చేయుటకు కింది సాయి సిబ్బంది తప్పుడు నివేదికకు అందిస్తే ఎటువంటి డాక్యుమెంట్స్ పరిశీలించకుండా హద్దులు నిర్ణయిస్తూ ఎండార్స్మెంట్ ఎలా మండల తహశీల్దార్ కార్యాలయ అధికారులు జారీ చేశారని అన్నారు. తనకు సంబంధం లేని కొండ ఫోరంబోకు ప్రభుత్వ భూమిలో ఉన్న దళితుల పందులు షెడ్లు తొలగిస్తున్న రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు చిట్టి సింహాచలం, పంచాల శ్రీను, బమ్మిడి వేణుగోపాలు, దళిత సంఘాల ప్రతినిధి జి.చిరంజీవులు పాల్గొన్నారు.