మాట్లాడుతున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి
ప్రజాశక్తి- మెళియాపుట్టి
రైతులు దళారులను నమ్మ మోసపోవద్దని, పారదర్శకం గా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. మండలంలోని పరశురాంపురం రైతు భరోసా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం ఆర్బికెల ద్వారా కొనుగోలు చేస్తుందన్నారు. అందుకు ప్రతి రైతూ ఆర్బికెల్లో ధాన్యాన్ని విక్రయించాలన్నారు. ఈ సంవత్సరం సాధారణ వరి రకం ధాన్యం క్వింటాకు రూ.2,183, గ్రేడ్-ఎ రూ.2,203 ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించు కోవాలని సూచించారు. గోని సంచి, కూలీల, రవాణా ఖర్చులూ ప్రభుత్వం రైతులు ఖాతాలో జమ చేస్తుందని అన్నారు. ఈ సంవత్సరం జిపిఎస్ అమర్చిన వాహనాల్లో ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తుందని చెప్పారు. అనంతరం రైతులకు రాగి విత్తనాలను రాయితీపై అందించారు. కార్యక్రమంలో తహశీల్దార్ పి.సరోజని, ఎంపిపి ప్రతినిధి బి.ఉదరు కుమార్, జెడ్పిటిసి గూడ ఎండయ్య, వైసిపి మండల కన్వీనర్ పల్లి యోగి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మాధవరావు, మండల ఎఒ దానకర్ణుడు, సర్పంచ్లు తెంబూరు ప్రసాదరావు, ఎవ్వరి ఈశ్వరరావు అగ్రికల్చర్ అసిస్టెంట్ దుక్క శరత్ కుమార్రెడ్డి పాల్గొన్నారు.