- తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళి
- కలుజిల్లా పంచాయతీ అధికారి బి.రవికుమార్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి బి.రవికుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అందులో భాగంగానే తడి, పొడి చెత్త సేకరణ, నిర్వహణ, వర్మీ కంపోస్టు తయారీ, ప్లాస్టిక్ వాడకాన్ని తగించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రానున్న వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. పలు అంశాలను ‘ప్రజాశక్తి’ ముఖాముఖిలో వెల్లడించారు.గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. తడి, పొడి చెత్త సేకరణకు పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. ఈ చెత్త తొలగింపు వల్ల గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి వీలవుతుంది. సేకరించిన చెత్త నిల్వ చేసుకునేందుకు, వాటి నుంచి సంపద తయారీకి అనువుగా వర్మీ కంపోస్టు తయారీ జరుగుతోంది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం శతశాతం కావడం వల్ల గ్రామ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయి. వర్మీ కంపోస్టు తయారీకి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్తను ఆయా గ్రామాల్లో వర్మీ కంపోస్టు తయారీకి అనువుగా ఉపాధి హామీ నిధులతో షెడ్లను నిర్మించాం. ఇంకొన్నిచోట్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది.గ్రామ సచివాలయాల పరిధిలో పర్యవేక్షణ జరుగుతోంది. వర్మీ కంపోస్టు తయారీ ద్వారా తిరిగి ఆదాయ వనరులు సమకూర్చుకోవడం జరుగుతోంది.వేసవిలో నీటిఎద్దడి నివారణకు తీసుకునే ప్రణాళికలు ఏమిటి?వేసవిలో నీటిఎద్దడి తలెత్తే పరిస్థితి లేకుండా ముందస్తు ప్రణాళికలను రూపొందిస్తున్నాం. గ్రామ పంచాయతీల పరిధిలో ఆర్థిక సంఘం నిధులతో బోర్లు మరమ్మతులు చేపట్టనున్నాం. ఆర్డబ్ల్యుఎస్ పరిధిలోని రక్షిత మంచినీటి పథకాల నిర్వహణతో పాటు ఎక్కడైనా మరమ్మతులకు గురైతే తక్షణమే బాగు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు వల్ల సురక్షితమైన తాగునీరు అందించేందుకు వీలుంది.పంచాయతీలకు నిధుల లభ్యత ఎలా ఉంది?ఆర్థిక సంఘం నిధులు ఆయా గ్రామ పంచాయతీల ఖాతాలకు జమ అయ్యాయి. ఏకగ్రీవ పంచాయతీలకు పారితోషిక నిధులు, పన్నులు, ఇతర సెస్ల రూపంలో వసూలవుతున్న నిధులు ఉన్నాయి. వాటిని వినియోగించుకునేందుకు వీలు కల్పించడమైంది. గ్రామ పంచాయతీల నిధుల నుంచి నిర్వహణ వ్యయానికి, సిబ్బంది వేతనాలు ఖర్చు చేసుకోవచ్చు.