అవగాహన కల్పిస్తున్న కృష్ణ
ప్రజాశక్తి- రణస్థలం
మండలం కోష్ట పంచాయతీ పైడిపేటలో పైడి లక్ష్మి అనే మహిళా రైతుకు చెందిన 0.15 సెంట్లులో కూరగాయల పంటలతో ఎటిఎం మోడల్ ఆదివారం వేశారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్వవసాయ మాస్టర్ ట్రైనర్ కృష్ణ మాట్లాడుతూ ఎటిఎం మోడల్లో ఒక బెడ్ వెడల్పు నాలుగు అడుగులు మధ్యలో ఒక అడుగు కాలువ ఏర్పాటు చేసుకొని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న బెడ్డపై దుంప జాతి ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, కాయగూరలైన వంగ, టమోటా, బెండ, చిక్కుడు, మిరప, ఆకుకూరలైన తోటకూర, గోంగూర, జొన్న, సజ్జ తదితర పంటలు నిర్ణీత కొలతల ప్రకారం వేసుకుంటే 365 రోజులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో నిరంతరం కూరగాయలు దిగుబడిని పొందవచ్చునని రైతులకు సూచించారు. నేలను 365 రోజులు కప్పి ఉంచవచ్చునని, ఇలా చేయడం వలన పౌష్టికాహారంతో పాటు మంచి నేలలు కూడా తయారై చీడపీడల యాజమాన్యం సులువుగా చేసుకోవచ్చునన్నారు. ఈ విధంగా మోడల్స్ వేయడం వలన తక్కువ ప్రదేశంలో ఎక్కువ ఆదాయం, ఎక్కువ రకాల పంటలు పండించుకోవచ్చనన్నారు. కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జి కొయ్యాన రాంబాబు, డిజిటల్ కార్యకర్త శివ శంకర్, ప్రకృతి వ్యవసాయ గ్రామకార్యకర్తలు పిసిని సంతోషి, ప్రమీల, భారతి, సురేష్ కుమార్, లక్ష్మి, రైతులు పాల్గొన్నారు.