ఆస్పత్రి అధికారులను నిలదీస్తున్న చైర్మన్ గిరిబాబు
మున్సిపల్ చైర్మన్ గిరిబాబు
ప్రజాశక్తి- పలాస
పలాస ప్రభుత్వాస్పత్రి నూతన భవనాలను ప్రారంభించే సమయంలో తనను ఎందుకు అవమానించారని, ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదని, ఈ ఉల్లంఘనపై హైకోర్టును ఆశ్రయిస్తానని మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు స్పష్టం చేశారు. పలాస ప్రభుత్వాస్పత్రిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఆస్పత్రి అభివృద్ధికి కమిటీ చైర్మన్ ఎవరు? శిలాఫలకంలో ప్రోటోకాల్ ప్రకారం తన పేరు వేరే చోట ఎందుకు వేశారు? అలా పేరు వేయమని ఎవరు చెప్పారు? ఆస్పత్రి నిర్మాణం చేసిన పనులకు బిల్లులు ఎంత చెల్లించారు? చెప్పాలంటూ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆస్పత్రి అభివృద్ధి కమిటీలో సభ్యునిగా ఉన్నప్పుడు రెండున్నరేళ్లుగా సమావేశాలకు తనకు ఎందుకు ఆహ్వానించడం లేదో చెప్పాలని అధికారులను నిలదీశారు. 24 గంటల్లో వేసిన శిలాఫలకాన్ని తొలగించకపోతే హైకోర్టులో పిటిషన్ వేస్తానని హెచ్చరించారు. హాజరు పట్టికలో 11 మంది డాక్టర్లను చూపించి నలుగురు డాక్టర్లు డిప్యూటేషన్పై వస్తున్నట్లు చెబుతూ మరో ఇద్దరు వైద్యులు బయటకు వెళ్లారని, కేవలం ఐదుగురు వైద్యులు మాత్రమే విధి నిర్వహణలో ఉండడాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ సుశీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆస్పత్రి విజిట్ బుక్పై సంతకం చేసి శిలాఫలకంపై తన పేరు ఎక్కడో ఒకచోట ఎందుకు పెట్టారో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని వెనుదిరిగారు.