ధర్నా చేస్తున్న న్యాయవాదులు
ప్రజాశక్తి- ఆమదాలవలస
ఆంధ్రప్రదేశ్ భూహక్కుల చట్టం (ఎపి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు 27/2023) అక్టోబరు 31 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా జిఒ నంబరు 512ను జారీ చేసిందని, ఇది ఒక నల్ల చట్టమని, ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర కమిటీ సభ్యుడు బొడ్డేపల్లి మోహనరావు డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు చాపర విజయలక్ష్మి ఆధ్వర్యాన పట్టణంలోని ప్రధాన రహదారిపై మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ చట్టం అమల్లోకి వస్తే మొట్టమొదటగా నష్టపోయేది పేదలు, దళితులు, బలహీన వర్గాల వారేనని నినదించారు. తాజాగా ఈ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రభుత్వాన్ని నిలదీశారు. పేదల భూములను అక్రమ రికార్డులతో ఆక్రమించే భూ కబ్జాదారులకు ఇది ఉపయోగపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ హక్కులు, స్థిరాస్తి హక్కుల వివాదాలను పరిష్కరించే సివిల్ కోర్టులను పక్కనపెట్టి రెవెన్యూ అధికారులకు బాధ్యతలను అప్పజెప్పడమంటే అందులోని లోగుట్టు అర్థమవుతున్నదని న్యాయవాదులు నినదించారు. కార్యక్రమంలో న్యాయవాదులు సాధు ధనుంజయరావు, కింతలి త్రినాథరావు, అల్లాడ విజరు కుమార్, హనుమంతు అచ్చంనాయుడు, బూర్లె సీతారాం, బి.గోవిందరాజు, పివిఎస్, తమ్మినేని అన్నంనాయుడు, రమణారావు పాల్గొన్నారు.