సమావేశంలో మాట్లాడుతున్న జెసి నవీన్
జిల్లాలో 82 పరీక్షా కేంద్రాలు
హాజరు కానున్న 24,500 మంది అభ్యర్థులు
ఏర్పాట్లపై సమీక్షించిన జెసి ఎం.నవీన్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
ఎపిపిఎస్ ఆధ్వర్యాన ఈ నెల 25న నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లైజన్ ఆఫీసర్లుగా జిల్లా అధికారులను నియమించాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవలన్నారు. అభ్యర్థులు సమయ పాలన, నిర్ధేశిత సూచనలు తప్పక పాటించాలన్నారు. మెటీరి యల్ తీసుకువెళ్లే వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశిం చారు. లైజన్ అధికారులు మెటీరి యల్ తీసుకువెళ్లిన సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. పరీక్షలకు 24,500 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వివరించారు. మొత్తం 82 పరీక్ష కేంద్రాలకు ఒక్కొక్క కేంద్రానికి లైజన్ ఆఫీసర్, చీఫ్ సూపరింటెండెంట్లను, రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు. పరీక్ష ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా దూర ప్రాంతాల నుంచి సరిపడ ఆర్టిసి బస్సులు నడపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. ఎవరికి అప్పగించిన విధులు వారు బాధ్యతతో పనిచేయాలన్నారు. అభ్యర్థులు గుర్తింపు కార్డులు తీసుకురావాలన్నారు. సిటింగ్ ఏర్పాట్లను ముందుగానే చూసుకోవాలన్నారు. ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా అదనపు ఎస్పి ఎన్.ప్రేమకాజల్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లపై వివరించారు. పరీక్ష సమయాల్లో జిరాక్స్ షాపులు ముసివేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎపిపిఎస్సి సహాయ కార్యదర్శి వసంతకుమార్ మాట్లాడుతూ జిల్లా ట్రెజరీలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. రూట్ ఆఫీసర్స్ ఉదయం 5.30 గంటలకు హాజరై మెటీరియల్ తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ అనుమతించ బడదన్నారు. పరీక్షా నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సమావే శంలో ఇన్ఛార్జి డిఆర్ఒ అప్పారావు, డిఎస్పి శృతి, ఎపిపిఎస్సి సెక్షన్ ఆఫీసర్లు భాస్కరరావు, జిల్లా అధికారులు సమగ్ర శిక్షా ఎపిసి జయప్రకాష్, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఒ వెంకట్రామన్, డిఆర్డిఎ పీడీ విద్యాసాగర్, డిపిఒ వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి బి.మీనాక్షి, సెట్విస్ సిఇఒ ప్రసాదరావు, ఎన్వైకె యూత్ కో-ఆర్డినేటర్ ఉజ్వల్, సూపరెంటెండెంట్ రామారావు, క్రాంతి, కళాశాలల ప్రిన్సిపాళ్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, పాల్గొన్నారు.