మాట్లాడుతున్న డిఎంహెచ్ఒ మీనాక్షి
- డిఎంహెచ్ఒ మీనాక్షి
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
జిల్లాలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు జరిపిన పిదప వివరాలు వెల్లడించడం చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.మీనాక్షి పేర్కొన్నారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం అమలుపై డిఎంహెచ్ఒ కార్యాలయంలో జిల్లాస్థాయి సలహా మండలి సమావేశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిబంధనలను ఉల్లంఘిస్తున్న స్కానింగ్ సెంటర్లపై, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, సెంటర్ల లైసెన్స్లను రద్దు చేస్తామని హెచ్చరించారు. గర్భస్థ శిశు స్థితిగతులు, సమస్యలు తెలుసుకునేందుకే స్కానింగ్లు చేయాలే తప్ప, వీటిని ఆసరాగా తీసుకుని గర్భస్థ శిశు వివరాలు వెల్లడించడం నేరమన్నారు. జిల్లాలో 108 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని, ప్రతి స్కానింగ్ సెంటరులో సిసి కెమెరాల ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆయా కేంద్రాలపై ప్రోగ్రాం అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. ఇకపై ప్రతి ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రుల్లో జరిగే అబార్షన్ల వివరాలతో పాటు అందుకు తగిన కారణాలను తమకు సమర్పించాలని స్పష్టం చేశారు. సమాజంలో బాల బాలికలిద్దరూ సమానమేనని, స్త్రీలపై వివక్ష ఉండరాదని వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పి విఠలేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు నిష్పత్తి పురుషులతో పోలిస్తే తక్కువగా ఉన్నారని, పురుషుల నిష్పత్తితో సమానంగా మహిళలు ఉండే విధంగా కృషి చేయాలని అన్నారు. విశ్రాంత న్యాయమూర్తి పి.జగన్నాథం మాట్లాడుతూ దేశంలో మంచి చట్టాలు ఉన్నాయని, వాటిని సక్రమంగా వినియోగించుకుంటే సమాజం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అదనపు డిఎంహెచ్ఒ డాక్టర్ బి.అనురాధ మాట్లాడుతూ గర్భస్థ శిశు లింగ నిర్ధారణపై గ్రామస్థాయి నుంచే అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో హెల్త్ ఎడ్యుకేటర్స్ ఎస్.సూర్యకళ, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, డిఐఒ ఈశ్వరిదేవి, డిప్యూటీ డెమో ఆఫీసర్ ఎం.వెంకటేశ్వరరావు, విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ మోహనరావు, డాక్టర్ మంత్రి వెంకట స్వామి, డాక్టర్ శ్రీనివాసరావు, హెల్త్ ఎడ్యుకేటర్స్ మోహిని పాల్గొన్నారు.