సత్కరిస్తున్న కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్
కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్
ప్రజాశకి ్త- శ్రీకాకుళం అర్బన్
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించడంలో వాలంటీర్ల వ్యవస్థ కీలకంగా వ్యవహరిస్తోందని, వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా వాలంటీర్లు సేవలు అందిస్తున్నారని, బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మరింత మంచిపేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లాలో సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలు పొందిన గ్రామ, వార్డు వాలంటీర్లు 12,123 మంది ఉన్నారని తెలిపారు. వీరికి సర్టిఫికెేట్, శాలువా, బ్యాడ్జి, మెడల్తో పాటు నగదు పురస్కారాలు అందజేస్తామన్నారు. ప్రభుత్వం వాలంటీర్లకు గతం కంటే ప్రోత్సాహకాలను పెంచిందని సేవా వజ్ర నగదు పురస్కారం పొందిన 40 మందికి రూ.45 వేల చొప్పున బహుమతి, సేవారత్న నగదు పురస్కారం పొందిన 171 మందికి రూ.30 వేలు చొప్పున సేవామిత్ర పురస్కారం పొందిన 11,192 మందికి రూ.15 వేల చొప్పున బహుమతి ఉంటుందన్నారు. వాలంటీర్లకు వందనం పేరుతో జిల్లాకు కేటాయించిన అవార్డుల మొత్తం రూ.18,56 కోట్లని ప్రకటించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన పలువురు వాలంటీర్లు బంగారు ఉమా శంకర్ (దందివేసి), హేమలత (అరసవల్లి), బంటుపల్లి లక్ష్మణ్ (కొర్ని), గురుగుబెల్లి శివాజీ (ఆమదాలవలస), బర్రి లక్ష్మి (పొందూరు), బి.పాపారావు (జలుమూరు), కింజరాపు కిశోర్ (ఎచ్చెర్ల)కు సేవావజ్ర పురస్కారాలను కలెక్టర్ ప్రదానం చేశారు. ఈ అవార్డు వారిలో మరింత బాధ్యత పెంచుతుందని కలెక్టర్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడు రోజుల పాటు వాలంటీర్లకు వందనం కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు, జిల్లాపరిషత్ సిఇఒ డి.వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి టి.వెంకటేశ్వరరావు, డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, పొందర, కూరాకుల కార్పొరేషన్ చైర్పర్సన్ రాజాపు హైమావతి అప్పన్న, పలువురు అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.