నమూనా చెక్కును అందజేస్తున్న కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
పేదరికం కారణంగా విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోలేని విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోందని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. విదేశీ విద్యా దీవెన పథకం మూడో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం బటన్ నొక్కి విడుదల చేశారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ మాట్లాడుతూ విదేశాల్లోని టాప్ 50 విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇతర కోర్సుల్లో విద్యను అభ్యసించే వారికి శతశాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు తమ తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం పొంది ఉన్నత విద్యను అభ్యసించవచ్చన్నారు. ఈ పథకానికి అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకొని విదేశీ విద్యను పొందాలన్నారు. జిల్లా నుంచి విదేశీ విద్యా దీవెన పథకంలో అర్హత పొంది కెనడా, ఆస్ట్రేలియాలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం కింద ఎంపికైన ఇద్దరికి రూ.42,29,591 నమూనా చెక్కును అందజేశారు. సమావేశంలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వై.విశ్వమోహన రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఇ.అనురాధ, పలు శాఖ అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.