వినతిపత్రం అందజేస్తున్న యుటిఎఫ్ నాయకులు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ప్రతినెలా 1న జీతాలు చెల్లించాలని, లేకుంటే ఆందోళన చేస్తామని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లోని డిఆర్ఒ వి.గణపతిరావును సోమ వారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నెల 19 నుంచి 21 వరకు ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతిపత్రాలు అందజేస్తామని అన్నారు. 27న తాలూకా, డివిజన్ కేంద్రాల్లో ఆరు గంటల ధర్నా, జనవరి 3న కలెక్టర్ కార్యాలయం వద్ద 12 గంటల ధర్నా, జనవరి 7,8 తేదీల్లో రాష్ట్ర కేంద్రంలో 36 గంటల ధర్నా చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. రెండేళ్లుగా సకాలంలో జీతాలు చెల్లించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అన్నారు. 15 వరకు చాలామందికి జీతాలు చెల్లించడం లేదని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. బ్యాంకు లోన్లు కలిగిన వారికి ప్రతినెలా సకాలంలో వాయిదాలు చెల్లించనందున పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గతంలో ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో పిఆర్సి, డిఎ ఎరియర్స్, పిఎఫ్, ఎపిజిఎల్ఐ, సరెండర్ లీవులు తదితర బకాయిలను సెప్టెంబరు నెలాఖరులోగా చెల్లిస్తామని హామీ ఇప్పటికీ నెరవేరలేదని అన్నారు. ఈయనతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి, జిల్లా నాయకులు ఎల్.కోదండరామయ్య ఉన్నారు.