మాట్లాడుతున్న జెఎసి జిల్లా అధ్యక్షులు సాయిరాం
- కలెక్టరేట్ వద్ద యుటిఎఫ్ రిలే నిరాహార దీక్ష
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
ఉపాధ్యాయ, ఉద్యోగులకు 30శాతం ఐఆర్ వెంటనే ప్రభుత్వం ప్రకటించాలని, ఆర్థిక బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టరేట్ వద్ద బుధవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్ కుమార్, జెఎసి జిల్లా చైర్మన్ హనుమంతు సాయిరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.18 కోట్ల పెండింగ్ బకాయిలు, సరెండర్ లీవ్, పిఎఫ్, ఎపిజిఎల్ఐ, మెడికల్ రీయంబర్సెమెంట్, డిఎలు, పిఆర్సి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్లుగడిచినప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల హామీలు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదని, ప్రతి పోరాటం సందర్భంగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇబ్బంది పెడుతుందన్నారు. అప్రజాస్వామ్య వైఖరి మారాలని, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ సమస్యలపై శాంతియుతంగా పోరాటం చేస్తుంటే, ప్రభుత్వం ఉపాధ్యాయులపై నిర్బంధాలు, అక్రమ కేసులు పెడుతూ భయాందోళనలకు గురిచేస్తోందని చెప్పారు. దీక్షలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర, ఆర్.దమయంతి, జిల్లా కార్యదర్శి హెచ్.అన్నాజీరావు, పి.సూర్యప్రకాశరావు, ఎస్.స్వర్ణకుమారి, జి.సురేష్, రాష్ట్ర కౌన్సిలర్ వె.ౖఉమాశంకర్ పాల్గొన్నారు.