ఇసుక రీచ్ను పరిశీలిస్తున్న అధికారులు
- కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్
ప్రజాశక్తి – శ్రీకాకుళం
జిల్లాలో ఎలాంటి ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా చేపట్టరాదని ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ ఆదేశించారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని కిల్లిపాలెం, నగరంలోని హయాతీనగరంలోని ఇసుక రీచ్లను ఎస్పి జి.ఆర్ రాధికతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16వ తేదీన సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు వారి జిల్లాల్లో ఎటువంటి ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరగకుండా చూడాలని ఆదేశించిందని తెలిపారు. ఇసుకపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ డిఎల్ఎస్సిలో అధికారులు తనిఖీలు, విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తనిఖీ నివేదిక, తీసుకున్న చర్యల వివరాలను ప్రతి వారం ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. ఇందులో భాగంగా కిల్లిపాలెం, హయాతీనగరంలో ఇసుక రీచ్లను తనిఖీ చేయగా, ఎటువంటి ఇసుక తవ్వకాలు, రవాణా లేవని గుర్తించారు. పరిశీలనలో డిపిఒ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి, ఆర్డిఒ, ఇరిగేషన్ ఇఇ, భూగర్భజలశాఖ అధికారి, ప్రాంతీయ రవాణాశాఖ అధికారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి, మైన్స్ అధికారులు, తహశీల్దార్ ఉన్నారు.