ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్ : నూతన విద్యా సంవత్సరానికి ఈనెల 12వ తేదీ నుంచి కొత్త బస్సు పాసులు జారీ చేయనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎ.విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు ఆర్టిసి రాయితీ పాసుల కోసం పాత వెబ్సైట్ స్థానంలో కొత్తది అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థి చదువుతున్న విద్యాసంస్థ నుంచి స్టడీ, బోనఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు నకలు తీసుకుని ఆన్లైన్లో ఎపిఎస్ఆర్టి.ఇన్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకుని పలాస, టెక్కలి, శ్రీకాకుళం బస్స్టేషన్లలోని బస్ పాస్ కౌంటర్లలో రాయితీ, ఉచిత పాసులను పొందవచ్చని తెలిపారు. జిల్లా పరిధిలో ఎంఎస్టి పాసులపై తిరిగే ప్రయాణికులకు పాసుల మంజూరు మరింత సులభతరం చేసేందుకు వెబ్సైట్ను అప్డేట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వెబ్సైట్ ఈనెల 6, 7 తేదీల్లో పనిచేయదని, 8వ తేదీ నుంచి యధావిధిగా బస్ పాసుల జారీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
![నూతన విద్యా సంవత్సరానికి](https://prajasakti.com/wp-content/uploads/2024/06/rtc-1.jpg)