ఓటు హక్కు వినియోగంపై నృత్యం చేస్తున్న విద్యార్థులు
ప్రజాశక్తి – శ్రీకాకుళం
ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించి, చైతన్యపరచడానికి జిల్లా అధికారులు స్వీప్ (క్రమబద్ధమైన ఓటర్ల విద్య, ఎన్నికల భాగస్వామ్యం) పేరుతో పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వినూత్న తరహాలో జిల్లా కేంద్రంలోని ఆర్టిసి కాంప్లెక్స్ వద్ద పలువురు విద్యార్థులతో మంగళవారం సాయంత్రం ఫ్లాష్ మాబ్ కార్యక్రమం చేపట్టి ఓటర్లను చైతన్య పర్చారు. వివిధ రకాల నృత్యాల ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేశారు. విద్యార్థులు నిర్వహించిన ఈ ఫ్లాష్ మాబ్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఫ్లాష్ మాబ్ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యత వివరించేలా ఇసిఐ రూపొందించిన పాటకు నృత్యం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఓటు వేయడానికి ఎన్నికల సంఘం విస్తృత స్థాయిలో ఏర్పాటు చేస్తోందని, అందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకుందామన్నారు. జిల్లా స్వీప్ నోడల్ అధికారి, డిఆర్డిఎ పిడి కిరణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ సూచనల ప్రకారం స్వీప్ ద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ ఓటు వేసేందుకు ముందుకు వచ్చేలా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నా మన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను చైతన్యం చేయడానికి విద్యార్థుల ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం ఆర్టిసి బస్టాండ్తో పాటు సూర్యమహల్ జంక్షన్, పాత బస్టాండ్, మిల్ జంక్షన్లో ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.