నామినేషన్ పత్రాలను అందజేస్తున్న అభ్యర్థులు
- నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆరో రోజు మంగళవారం శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 19 మంది 24 సెట్ల నామినేషన్లు వేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి వైసిపి అభ్యర్థి పేరాడ తిలక్ తరుపున ఎం.వి స్వరూప్ మూడో సెట్ నామినేషన్ను కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి మనజీర్ జిలానీ సమూన్కు అందించారు. జైభారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి ఇప్పిలి సీతరాజు మరో సెట్ నామినేషన్ను దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు చెల్లూరి డేనియల్, సనపల శ్రవణ్కుమార్ ఒక్కో సెట్ నామిసేషన్ వేశారు. ఇచ్ఛాపురం అసెంబ్లీ స్థానానికి బిఎస్పి అభ్యర్థి వేదవర బిసాయి నామినేషన్ వేశారు. పలాస అసెంబ్లీ స్థానానికి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అభ్యర్థి పి.కామేశ్వరరావు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. టెక్కలి అసెంబ్లీ స్థానానికి టిడిపి అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు మరో సెట్ నామినేషన్ను దాఖలు చేశారు. డమ్మీ అభ్యర్థిగా ఆయన సతీమణి కింజరాపు విజయ మాధవి నామినేషన్ వేశారు. బిఎస్పి అభ్యర్థిగా చింతాడ శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. పాతపట్నం అసెంబ్లీ స్థానానికి ఇండియా ఫోరం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి కొప్పరోతు వెంకటరావు, స్వతంత్ర అభ్యర్థులు రాజాన మోహనరావు, బగ్గు కృష్ణ, గొండ్వా దండకారణ్య పార్టీ అభ్యర్థి జన్ని సంజీవరావు, జైభారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి గొల్ల తిరుపతిరావు నామినేషన్లు వేశారు. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి పిరమిడ్ పార్టీ అభ్యర్థి కర్రి లక్ష్మణ నామినేషన్ దాఖలు చేశారు. ఆమదాలవలస అసెంబ్లీ స్థానానికి టిడిపి అభ్యర్థి కూన రవికుమార్ రెండు సెట్లు, డమ్మీ అభ్యర్థిగా ఆయన సతీమణి కూన ప్రమీల ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. పిరమిడ్ పార్టీ అభ్యర్థి ముద్దాడ మధుసూదనరావు, స్వతంత్ర అభ్యర్థి సనపల సురేష్ కుమార్ నామినేషన్లు వేశారు. ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా గొర్లె కిరణ్కుమార్, సువ్వారి రమ్య నామినేషన్లు దాఖలు చేశారు. నరసన్నపేట అసెంబ్లీ స్థానానికి వైసిపి అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్, నవరంగ్ కాంగ్రెస్ అభ్యర్థి కాయ కామేశ్వరి నామినేషన్లు వేశారు.