సభా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పి రాధిక
- శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలిలో బస్సు యాత్ర
- టెక్కలిలో ‘మేమంతా సిద్ధం’ ముగింపు సభ
- వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్
- విజయవంతం చేయాలని పిలుపు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్, టెక్కలి రూరల్
ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఈనెల 24వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారని వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 23న రాత్రి ఎచ్చెర్ల నియోజకవర్గానికి చేరుకుంటారని పేర్కొన్నారు. అక్కడే రాత్రి బస చేసి, 24న శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో బస్సు యాత్రను చేపడతారని తెలిపారు. టెక్కలిలో బస్సు యాత్ర ముగుస్తుందని, ఈ సందర్భంగా తిర్లంగి పంచాయతీ పరిధి అక్కువరం సమీపంలో నిర్వహించే మేమంతా సిద్ధం సభలో జగన్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. బస్సు యాత్ర, సభ విజయవంతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.సిద్ధం సభాస్థలి పరిశీలనసిద్ధం ముగింపు సభ నిర్వహించనున్న అక్కువరం సమీపంలోని సభా స్థలాన్ని సిఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. ఈ సభకు లక్ష మందికి తక్కువ కాకుండా జన సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 20 జిల్లాల్లో సిద్ధం సభలు నిర్వహించగా, అన్నిచోట్లా ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు కిల్లి అజరుకుమార్, సర్పంచ్ గొండెలి సుజాత, ఎంపిటిసి పీత హేమలత, బమ్మిడి తులసీరావు, సర్లాన సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.ఎస్పి పరిశీలనముఖ్యమంత్రి సిద్ధం సభ నిర్వహించే సభా స్థలాన్ని ఎస్పి జి.ఆర్ రాధిక పరిశీలించారు. హెలీప్యాడ్కు అనువుగా ఉంటుందా? లేదా? అడిగి తెలుసుకున్నారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. సభకు భారీ సంఖ్యలో జనాలు తరలివస్తే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఎఎస్పి జి.ప్రేమ్కాజల్, డిఎస్పి బాలచంద్రారెడ్డి, సిఐ పి.పైడయ్య ఉన్నారు.