పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్
ప్రజాశక్తి – టెక్కలి రూరల్
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాలను టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ ఆదివారం పరిశీలించారు. మండలంలోని లింగాలవలస, శెలిగాం, పోలవరం, రాధవల్లభాపురం, గంగధరపేట, రావివలస, ధర్మనీలాపురం, తలగాం, తేలినీలాపురంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎన్నికల సిబ్బంది ఉండేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఓటర్లకు కల్పించే సదుపాయాలను పర్యవేక్షించి పరిశీలించి సూచనలు చేశారు. వికలాంగులు ఓటు వేసేందుకు వీలుగా ర్యాంపు నిర్మాణాలు వంటి వాటిని పరిశీలించారు. ఎన్నికల సమయంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా అందుకు సన్నద్ధంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఆర్.బాలమురళీకృష్ణ, ఆర్ఐ డి.ఢిల్లేశ్వరరావు, ఎన్నికల డిటి విజయ, బిఎల్ఒలు, విఆర్ఒలు తదితరులు పాల్గొన్నారు.