మొక్కలు నాటుతున్న కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్
- పోలింగ్ అధిక శాతానికి అందరూ సహకరించాలి
- జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
సాధారణ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ పిలుపునిచ్చారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన స్వీప్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పర్యావరణ సహిత ఓటర్ల అవగాహనా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వ మహిళా కళాశాల ఆవరణలో మొక్కలు నాటి, పలువురికి మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అందరి చేతిలో ఆయుధం ఓటు అని, 18 ఏళ్లు నిండి ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరూ పోలింగ్ రోజు ఓటు వేయాలన్నారు. 2019 ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం మరింత బాగా పెరగాలని ఆకాంక్షించారు. మహిళలు, వికలాంగులు ప్రతిఒక్కరూ ఓటు వేయాలన్నారు. మారుమూల గ్రామాల్లో, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం మరింత పెరగాలని చెప్పారు. ఓటర్లు ధైర్యంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని, ఇందుకోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే లక్ష్యంతో స్వీప్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అధ్యక్షులు శిల్లా సతీష్ కుమార్, కార్యదర్శి వంశీకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఊడి సంతోష్ ఆధ్వర్యాన నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. కార్యక్రమంలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్డిఎ పీడీ కిరణ్ కుమార్, ఎల్డిఎం సూర్యకిరణ్, మెప్మా పీడీ కిరణ్, ఎన్వైకె కోఆర్డినేటర్ ఉజ్వల్, బిసి కార్పొరేషన్ ఇడి గడ్డెమ్మ, సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు, స్వీప్ స్వచ్ఛంద సంస్థ కొమ్ము రమణమూర్తి, ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ కె.సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.