ఆ పార్టీలను ఓడించాలి

మతోన్మాద బిజెపితో జత కలిసిన టిడిపి, జనసేన

సమావేశంలో మాట్లాడుతున్న తులసీదాస్‌

లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

మతోన్మాద బిజెపితో జత కలిసిన టిడిపి, జనసేన కూటమిని… నిరంకుశ వైసిపిని సార్వత్రిక ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడాలని కోరారు. నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ నియంతృత్వ బిజెపి ప్రభుత్వం దశాబ్దకాలంగా సాగించిన పాలనతో లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి మూల స్తంభాలుగా భావించే లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ఆర్థికసార్వభౌమత్వం, సమాఖ్యవాదం, సామాజిక న్యాయ వ్యవస్థలను పద్ధతి ప్రకారం బిజెపి ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం దేశంలో కార్మిక హక్కులను కాలరాసేందుకు నిరంకుశ పద్ధతులను అవలంభిస్తోందన్నారు. తద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోకెల్లా అత్యంత అసమానతలు కలిగిన సమాజాల్లో ఒకటిగా మారుస్తోందని విమర్శించారు. మరోవైపు ప్రజలను మతపరంగా విభజించేందుకు విషపూరితమైన మతోన్మాద సిద్ధాంతాలను అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో టిడిపి, జనసేన పొత్తు పెట్టుకోవడం… బిజెపి తొత్తుగా వైసిపి వ్యవహరించడం ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. బిజెపి దాని మిత్రపక్షాలను ఓడించాలని, లోక్‌సభలో సిపిఎం, వామపక్షాల బలాన్ని పెంచి కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకికవాద ప్రభుత్వం ఏర్పడేలా చూడాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ అరుకు పార్లమెంట్‌కు సిపిఎం అభ్యర్థి పోటీ చేస్తున్నారని, విజయానికి అందరూ కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాయకులు కె.మోహనరావు, కె.నాగమణి, ఎన్‌.షణ్ముఖరావు, పి.తేజేశ్వరరావు, సిర్ల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️