జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న మనజీర్ జిలానీ సమూన్
ప్రజాశక్తి – శ్రీకాకుళం
ఈనెల 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ప్రతిఒక్కరూ ఓటు వేసేందుకు తరలిరావాలని, ఓటు వేయడం మనందరి బాధ్యత అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ‘నీ ఓటు, నీ భవిష్యత్’ పేరిట ఓటు హక్కు వినియోగంపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శనివారం నిర్వహించిన బైక్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని 80 అడుగుల రోడ్డు మిల్లు కూడలి వద్ద ప్రారంభమైన ర్యాలీ సూర్యమహల్, ఏడు రోడ్ల జంక్షన్ మీదుగా ఆర్టిసి కాంప్లెక్స్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గత సాధారణ ఎన్నికల కన్నా ఎక్కువ శాతం ఓటింగ్ జరగాలన్నారు. 18 ఏళ్లు నిండి ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరూ ఎన్నికల్లో పోలింగ్ రోజు ఓటు వేయాలన్నారు. ర్యాలీలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆర్డిఒ సిహెచ్.రంగయ్య, డిఆర్డిఎ పీడీ కిరణ్ కుమార్, ఎల్డిఎం సూర్యకిరణ్, మెప్మా, హౌసింగ్ పీడీ కిరణ్, గణపతిరావు, ఎన్వైకె కోఆర్డినేటర్ ఉజ్వల్, జిల్లా పౌర సంబంధాల అధికారి కె.బాలమాన్ సింగ్ పలు శాఖల ఉద్యోగులు, యువత తదితరులు పాల్గొన్నారు.