ప్రజాశక్తి- దేవనకొండ (కర్నూలు) : 22 రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ తమ డిమాండ్లపై ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ కర్నూలు కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న దేవనకొండ ,ఆస్పరి, ఆలూరు మండలాల అంగన్వాడీ కార్యకర్తలను బుధవారం దేవనకొండ పోలీసులు ఈదుల దేవరబండ దగ్గర అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు, సిఐటియు నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమను కలెక్టరేట్ పంపించే వరకు రోడ్డు పైనే అడ్డంగా కూర్చుంటామని తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కె.పి నారాయణస్వామి దేవనకొండ మండల కార్యదర్శి అశోక్లు మాట్లాడుతూ.. ప్రభుత్వము సమస్య పరిష్కారం వైపు ప్రయత్నించాలి కానీ నిర్బంధం పెడితే ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. రోడ్డుపై బైఠాయించిన సిఐటియు నాయకులు నారాయణస్వామి అశోక్ లను బలవంతంగా పోలీస్ జీఫ్ ఎక్కి ఎక్కించి అరెస్ట్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు ముకుమ్మడిగా పోలీస్ జీప్కు అడ్డుపడి నాయకులను వదిలిపెట్టాలని పోలీసులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సుజాతమ్మ, జయశ్రీ ,భారతి, సరస్వతి,లక్ష్మీ, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/knl-1.jpg)