ప్రజాశక్తి -నెల్లూరు : క్రిస్మస్ పర్వదినం నాడు అంగన్వాడీల సమ్మె కొనసాగింది. నెల్లూరు వైఎంసిఏ గ్రౌండ్ వద్దనున్న జీసస్ విగ్రహం ముందు సోమవారం అంగన్వాడీలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్యమంత్రి మనసును జీసస్ అయినా మార్చాలని, తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేలా చూడాలని వారు ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా వి.ఆర్.సి సెంటర్ నుండి వైఎంసిఏ గ్రౌండ్స్ వరకు వారు నిరసన ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీల సమ్మెకు ఐసిడిఎస్ మాజీ కోఆర్డినేటర్ నంది మండలం భాను శ్రీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం అంగన్వాడీలపై అనుసరిస్తున్న మొండి వైఖరి విడనాడాలని, వారి కష్టాలను ప్రభుత్వం ఆలకించి సత్వరమే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. నెల్లూరు నగర, రూరల్ కార్యదర్శులు నాగేశ్వరరావు కిన్నెర కుమార్ లు మాట్లాడుతూ 13 రోజుల నుండి సమ్మె జరుగుతున్న ప్రభుత్వం దున్నపోతుపై వానపడ్డ చందంగా వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వం కవింపు చర్యలు మానుకోవాలని, అంగన్వాడీల సమస్యను సత్వరమే పరిష్కరించాలని లేకుంటే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/nellor-3.jpg)