ముమ్మరంగా తనిఖీలు చేయాలి : కలెక్టర్‌

Apr 6,2024 21:34

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : జిల్లాలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు ముమ్మరం చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ అన్నారు. రిటర్నింగ్‌ అధికారులతో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎన్నికలు పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. నాలుగు నియోజక వర్గాల్లో 48 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, 36 స్టాటిక్‌ సర్వేలియన్ల బృందాలు, 16 వీడియో సర్వేలియన్స్‌ బృందాలు, 4 వీడియో వ్యూయింగ్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాల పనితీరు కమాండ్‌ కంట్రోల్‌ రూం ద్వారా పర్యవేక్షిస్తాయని ఆయన చెప్పారు. ప్రజలు సమాచారాన్ని 1950 టోల్‌ ఫ్రీ నెంబరుతో సహా సి-విజిల్‌, ఆన్‌ లైన్‌ ఫిర్యాదుల విభాగంలో సైతం అందించవచ్చు అన్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు తమ తనిఖీలు ముమ్మరం చేయాలని, ఎన్నికల ప్రలోభాలకు సంబంధించి ఎటువంటి రవాణా జరుగుతున్నా, కార్యకలాపాలు సాగుతున్న నిర్ణీత సమయంలో తనిఖీలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. సి విజిల్‌ ఫిర్యాదులు పరిష్కారంలో మరింత వేగాన్ని పెంచాలని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద వెబ్‌ కాస్టింగ్‌ విధిగా చేయాలని ఆయన ఆదేశించారు. అంతర్‌ రాష్ట్ర, అంతర్‌ జిల్లా సరిహద్దుల వద్ద గట్టి నిఘా ఉండాలని, మద్యం, గంజాయి, ఇతర సామగ్రి రవాణాకు అవకాశం ఉందని ఆయన సూచించారు. ప్రచారాలకు రాజకీయ పార్టీలు సువిధ యాప్‌ ద్వారా ఆన్‌ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై చర్యలు పార్వతీపురం: సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా పేర్కొన్నారు. శనివారం జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్‌పిలతో వీడియో కాన్పరెన్సు నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. గంజాయి, మద్యం, నగదు, ఉచితాల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఉంచాలని, రాష్ట్రాల సరిహద్దులు, జిల్లాల సరిహద్దుల్లో ఉండే చెక్‌ పోస్ట్‌లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. జప్తు సమయంలో వ్యాపారులు, సాధారణ పౌరుల విషయంలో ఆచీతూచీ అడుగువేయాలని, వారిని ఎటువంటి ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. నగదు జప్తు కేసులను 24 గంటల్లోనే పరిష్కరిం చాలని, ఇందుకు రాష్ట్రమంతా ఒకే విదానాన్ని అనుసరించేలా త్వరలో ఒక విధానాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. భారత ఎన్నికల సంఘం రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకును నియమిం చిందని, వీరు నేరుగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నేతృత్వంలో పనిచేస్తుంటారని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌, సీతంపేట ఐటిడిఎ పిఒ, పాలకొండ శాసన సభ నియోజక వర్గం ఆర్‌ఒ కల్పనా కుమారి, పార్వతీపురం పిఒ, సాలూరు శాసనసభ నియోజక వర్గం ఆర్‌ఒ సి.విష్ణుచరణ్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ శోబిక, ఇన్‌ఛార్జ్‌ డిఆర్‌ఒ జి.కేశవ నాయుడు, పార్వతీపురం ఆర్‌డిఒ, శాసనసభ నియోజకవర్గం ఆర్‌ఒ కె.హేమలత, పాలకొండ ఆర్‌డిఒ, కురుపాం శాసన సభ నియోజక ఆర్‌ఒ వి వెంకట రమణ, ఎస్డిసి ఆర్‌వి సూర్యనారాయణ, నోడల్‌ అధికారులు ఒ.ప్రభాకర రావు, వి.తిరుపతయ్య, ఎం.వి.కరుణాకర్‌, లోచర్ల రమేష్‌, సహాయ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ ఇమంది మురళి తదితరులు పాల్గొన్నారు.

➡️