కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పి
ప్రజాశక్తి-విజయనగరం కోట : కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లన్నీ పక్కాగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పి దీపికా పాటిల్ తో కలసి లెండి కాలేజ్, జె ఎన్టియుజిలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ సిబ్బందికి, మీడియాకు ఏ ఒక్కరికీ మొబైల్ ఫోన్లు కౌంటింగ్ కేంద్రాల లోపలికి అనుమతి లేనందున మొబైల్ ఫోన్ డిపాజిట్ వాటర్ ప్రూఫ్ రూమ్ను ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్ల కు , అభ్యర్థులకు ప్రత్యేకంగా టెంట్లను ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మీడియా వారికోసం మీడియా రూమ్ ఏర్పాటు చేయాలని, మీడియా వారిని కౌంటింగ్ కేంద్రం వద్దకు పోలీస్ ఎస్కార్ట్ తో పంపాలని తెలిపారు. కౌంటింగ్ సిబ్బందికి, ఏజెంట్లకు, భోజన ఏర్పాట్లు, తాగు నీరు, టెంట్ లను ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ వద్ద డ్రైవర్ల కు కూడా షెడ్లను ఏర్పాటు చేయాలన్నారు. మెయిన్ గేట్ వద్ద ఐడి కార్డ్ ను చూసి లోపలకి పంపాలని, రెండు దశలలో చెకింగ్ ఉండాలని ఎస్పికి సూచించారు. కలెక్టర్ వెంట జెసి కార్తీక్, డిఆర్ఒ అనిత, ఆర్డిఒ సూర్య కళ, డిప్యూటీ సిఇఒ రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.