అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు : డిఎస్పి ప్రజాశక్తి – గూడూరు టౌన్ : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పి సూర్యనారాయణరెడ్డి హెచ్చరించారు. గూడూరు పట్టణ పరిధిలోని చవటపాళెం ప్రాంతంలో డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి మంగళవారం తనిఖీలు నిర్వహించారు. పలు ఇళ్లల్లో ఉంటున్న వారి వివరాలు సేకరించారు. సరైన పత్రాలు లేని వాహనాలను వారు సీజ్ చేశారు. యువతకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ నేరాల నియంత్రణలో భాగంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నామన్నారు. కొత్త వ్యక్తుల సమాచారం, పాత నిందితుల కదలికలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు కూడా సహకరించాలన్నారు. ఈ తనిఖీల్లో సీఐలు దశరధరామారావు, హజరత్ బాబు, వెంకటేశ్వరరావు, ఎస్ఐలు మనోజ్ కుమార్, అంజిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.