కొత్తశానంబట్లలో ‘జల్లికట్టు’ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో చంద్రగిరి మండలం కొత్తశానంబట్లలో పశువుల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు. భారీగా తరలి వచ్చిన వీక్షకులకు గ్రామస్తులు భోజనం, తాగునీటి వసతులు కల్పించారు. పశువుల యజమానులు గ్రామ దేవతకు పూజలు చేసి కోడెగిత్తలకు, ఆవులకు, దూడల కొమ్ములకు రంగులు వేసి కొప్పులు తొడిగారు. రాజకీయ నాయకుల, సినీనటుల ఫొటోలతో కూడిన రంగు కాగితాలు అంటించిన చెక్క పలకలను, నగదును, విలువైన వస్తు సామాగ్రిని కొమ్ములకు కట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు వీధిలో పశువులను గుంపులు గుంపులుగా వదిలారు. అల్లి అవతల నిలబడిన యువకులు జోరుగా వచ్చే కోడెగిత్తలను నిలువరించేందుకు పోటీపడ్డారు. కొమ్ములకు అంటించిన చెక్కపలకలను సొంతం చేసుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. జల్లికట్టు ను చూడడానికి పరిసర ప్రాంతాల నుంచి యువకులు భారీగా తరలి రావడంతో సందడి నెలకొంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/Untitled-1444444444444444444444444444444444.jpg)