సమాచార ఉపగ్రహ ప్రయోగాలలో అరుదైన ప్రయోగం…ప్రజాశక్తి- సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో శాస్త్రవేత్తలు మరో అత్యంత కీలకమైన ఉపయోగాత్మకమైన ఉపగ్రహాన్ని శనివారం ప్రయోగించి ఘనవిజయం సాధించారు. శ్రీహరి కోటలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి జిఎస్ఎల్వి- ఎఫ్ 14 రాకెట్ ద్వారా ఇన్శాట్ 3డిఎస్ పేరుతో సమాచార సేవలకు ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. 2275 కిలోలు బరువు ఉన్న కనీసం 10 సంవత్సరాల పాటు దేశానికి సేవలు అందిస్తుందని అనుకుంటున్న ఇన్శాట్ 3 డీఎస్ బహుళ ప్రయోజనాల కోసం రూపొందించబడింది. ఇప్పటికే భారత్ ఎన్నో ఇన్శాట్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చి ఉంది. అయితే వాటిలో కొన్నికాలం తీరాయి. మరికొన్ని ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి చేరలేకపోయాయి. గతంలో భారీ ఉపగ్రహం ఇన్శాట్ 3డిని అనుకున్న కక్ష్యలోకి చేర్చలేకపోయినా శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఇన్ శాట్ 3డిఎస్ పేరుతో సరికొత్తగా శాటిలైట్ను రూపొందించి ప్రయోగించారు. ఈ ఉపగ్రహ నిర్మాణం కూడా కొత్త డిజైన్తో రూపొందించారు. జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జిఎస్ఎల్వి) సిరీస్లో ఇప్పటికీ 15రాకెట్లను శ్రీహరికోట నుంచి ప్రయోగించి ఉన్నారు. 2000 కిలోలకు పైగా ఉపగ్రహాలను అలవోలుగా అంతరిక్షంలోకి చేర్చగలిగే సామర్థ్యం కలిగిన ఈ తరహా రాకెట్లలో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అయితే ఇటీవల జిఎస్ఎల్వీ ప్రయోగాలు కూడా మన సాంకేతిక పరిజ్ఞానంతోనే రూపొందించబడి విజయవంతమయ్యాయి. ప్రస్తుతం 10వ సారి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రాకెట్ లోని మూడవ కీలక దశ అయిన క్రయోజనిక్ ఇంజన్ను రూపొందించుకొని శాస్త్రవేత్తలు 16వ జిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం చేశారు. ఈ రాకెట్ మూడు దశలతో నిర్మితం కాగా అందులో మొదటిది ఘన ఇంధనం, రెండవది ద్రవఇంధనం, మూడవది క్రయోజనిక్ ఇంధనం కావడం విశేషం. ఈ రాకెట్తో కేవలం ఒకే ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోని జియోట్రాన్స్ ఫర్ ఆర్బిట్లోకి చేర్చారు. భూమికి 170 కిలోమీటర్లు తక్కువ దూరం, భూమికి 36,647 కిలోమీటర్ల ఎక్కువ దూరం దీర్ఘ వత్తాకార కక్షలోకి చేరిన తర్వాత ఈ ఉపగ్రహాన్ని భూకేంద్రాల నుంచి నియంత్రించి నిర్ణీత కక్ష్యకు చేర్చారు. రాకెట్ ప్రయోగం జరిగిన తర్వాత 1123 నిమిషాలకు ఇన్ శాట్ 3 డీఎస్ కక్షలో ప్రవేశిస్తుంది.