మెగా డిఎస్సి కావాలని నిరసనప్రజాశక్తి – తిరుపతి టౌన్ నాలుగు సంవత్సరాల నుంచి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నిరాశకు గురిచేసి రోడ్డుపై పడేలా చేసిందని విద్యార్థి యువజన సంఘాలు మండిపడ్డాయి. అన్నమయ్య సర్కిల్లో రాస్తారోకో నిర్వహించి, ఆర్డీవో కార్యాలయం లోనికి చొచ్చుకుపోయారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఎఒకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులను మోసం చేసి దగా డిఎస్సి ప్రకటించారన్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలకు పోస్టులు లేకుండా చేశారన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ ఒక పక్క విద్యలో విప్లవం అంటూనే ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చలపతి మాట్లాడుతూ డిఎస్సి నోటిఫికేషన్ సవరణ చేసి మెగా డిఎస్సి 25వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అక్బర్, సురేష్, ఉదరు,హరి, అశోక్, శివ, పవన్, నవీన్, కార్తీక్, హరినాథ్ పాల్గొన్నారు.
![మెగా డిఎస్సి కావాలని నిరసన](https://prajasakti.com/wp-content/uploads/2024/02/megamegamega.jpg)